కరోనా బాధితులకు చికిత్స ఎలా? గాంధీ వైద్యులు నయం చేశారిలా..


మనిషికి సోకిన కరోనా వైరస్‌ను తొలగించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకూ ఎక్కడా కచ్చితమైన ఔషధాలు లేని సంగతి తెలిసిందే. మరి ఈ వైరస్ సోకిన రోగికి ఎలా చికిత్స అందిస్తారనే అంశం ఆసక్తిగా మారింది. తెలంగాణలోనూ తొలి కరోనా బాధితుడిగా నమోదైన యువకుడు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యాడు. ఇంకా 21 మంది ఇక్కడ చికిత్స పొందుతున్నారు. కరోనాను చంపేందుకు ఎలాంటి కచ్చితమైన మందు లేనప్పుడు మరి వీరందరికీ ఎలాంటి చికిత్స అందిస్తున్నారనే అంశంపై గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్ కుమార్ స్పష్టత ఇచ్చారు. అమెరికాలో కరోనా రోగులకు యాంటీ మలేరియా డ్రగ్‌ అయిన క్లోరోక్విన్‌ తదితర మందులను ఇస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌ ఇటీవల ఓ సందర్భంలో తెలిపారు. అయితే, ఇదే విధానాన్ని కూడా ఇతర దేశాలు అనుసరిస్తున్నారు. రాష్ట్రంలో తొలి కరోనా వైరస్‌ బాధితుడు కోలుకోవడంలో క్లోరోక్విన్‌ మందులనే వాడినట్లుగా గాంధీ సూపరింటెండెంట్‌ శ్రావణ్‌ తెలిపారు.

క్లోరోక్వీన్ మందులతో హెచ్ఐవీ, ఎబోలా మందులూ

రాష్ట్రంలోకి ప్రవేశించిన కరోనా వైరస్ వల్ల వచ్చిన వ్యాధికి చికిత్స అందించడాన్ని తాము సవాలుగా తీసుకుని పని చేసినట్లుగా సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్ కుమార్ వెల్లడించారు. అంతేకాక, వివిధ దేశాల్లో కరోనా వైరస్ బారిన పడ్డ రోగులకు ఎబోలా, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌, మలేరియా, ఎయిడ్స్‌‌ తదితర రోగాలకు వాడే మందులను ఇచ్చి నయం చేసేందుకు ప్రయత్నిస్తుండడంతో గాంధీ ఆస్పత్రి వైద్యులూ అదే దారిలో చికిత్స ప్రారంభించారు. క్లోరోక్విన్‌తోపాటు హెచ్‌ఐవీ, ఎబోలా రోగులకు ఇచ్చే లువినవీర్‌, రెమిడిసివీర్‌ ఔషధాలను కూడా ఈ తొలి కేసులోని యువకుడికి కొనసాగించామని డాక్టర్‌ శ్రావణ్‌ తెలిపారు.

నిపుణులతో ఆరోగ్య స్థితి పర్యవేక్షణ

తొలి కేసులో యువకుడికి చికిత్స అందించిన వైద్యుల్లో జనరల్‌ ఫిజిషియన్‌, పల్మనాలజిస్టు (ఊపిరితిత్తుల నిపుణులు), జనరల్‌ మెడిసిన్‌, సైకాలజిస్టులు ఉన్నారు. బాధితుడి ఆరోగ్య స్థితిని వీరు అంచనా వేశారు. గాంధీ ఆస్పత్రిలో చేరేసరికే జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులు, న్యూమోనియాతో యువకుడు బాధపడుతున్నట్లు గుర్తించారు. ముందు వాటిని అదుపులోకి తేవడానికి చికిత్స ప్రారంభించారు. న్యూమోనియా కారణంగా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఉండడంతో నిరంతరం ఆక్సిజన్‌ అందించారు. బీపీని నార్మల్‌గా ఉంచుతూ శక్తి కోసం ఫ్లూయిడ్స్‌ అందించినట్లుగా వైద్యులు వెల్లడించారు.

మానసికంగా దృఢంగా ఉండేందుకు..

కరోనా సోకిన యువకుడు మానసికంగా కుంగిపోకుండా రోజూ సైకాలజిస్టుతో కౌన్సెలింగ్‌ ఇప్పించామని డాక్టర్ శ్రావణ్ కుమార్ వెల్లడించారు. దీంతో క్రమంగా జ్వరం తగ్గడంతోపాటు న్యూమోనియా కూడా అదుపులోకి వచ్చిందని తెలిపారు. బాధితుడు చేరిన 8వ రోజు మరోసారి పరీక్షలు చేయడంతో కరోనా వైరస్‌ లేనట్లు నిర్ధారణ అయిందని చెప్పారు. 2 రోజుల తర్వాత మళ్లీ నిర్వహించిన పరీక్షల్లోనూ కరోనా లేదని స్పష్టమైంది. సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవడంతో ఈ నెల 14న యువకుణ్ని డిశ్చార్జి చేసినట్లు వివరించారు. ముందస్తుగా ఆయన్ను ఇంటి వద్దే స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించనట్లుగా సూపరింటెండెంట్ చెప్పారు.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.